మొగుళ్లపల్లి మండలంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మన భారత్,మొగుళ్ళపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలంలో పలు గ్రామాల్లో రూ.1.80 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మొగుళ్లపల్లి మండలంలోని కొరికిశాల, ఎల్లారెడ్డిపల్లి, మొగుళ్లపల్లి గ్రామాల్లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మంజూరైన నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని ఇతర మండలాలతో పోలిస్తే మొగుళ్లపల్లి మండలం అభివృద్ధిలో కొంత వెనుకబడి ఉందని, అందుకే ఈ మండల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పనతో పాటు మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మొగుళ్లపల్లి మండలానికి కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించలేకపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొగుళ్లపల్లి మండల ప్రజల అవసరాలను గుర్తించి అంబులెన్స్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, మండల పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
