దేవాపూర్లో డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు..
ఘనంగా నివాళులర్పించిన బీజేపీ యువమోర్చ నాయకులు
మన భారత్, తలమడుగు | జూలై 6
తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామంలో భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ జాతీయవాది డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ యువమోర్చ తలమడుగు మండల అధ్యక్షుడు దాతాజీ కిరణ్ నాయకత్వం వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ సమగ్రత, జాతీయ ఏకత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు.
ఒకే దేశంలో రెండు విధానాలు ఉండకూడదనే సిద్ధాంతంతో దేశ సమైక్యత కోసం పోరాడిన ధీరుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. భారతీయ జనసంఘ్ను స్థాపించి దేశ సాంస్కృతిక పునరుజ్జీవనానికి బాటలు వేసిన మహనీయుడిగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ సేవలు చిరస్మరణీయమని అన్నారు. సనాతన భారతీయ సంస్కృతి, జాతీయత పట్ల ఆయనకు ఉన్న అంకితభావం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
జయంతి సందర్భంగా డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ దేశానికి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను ప్రతి కార్యకర్త ఆచరణలో పెట్టాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో శానం శ్రీనివాస్, అడెపు శ్రీనివాస్, రేగుల మోహన్, పిట్ల శేఖర్, పోరన్ల రాములు, గంధం నరేష్, శాగంటి విష్ణు, ఓస రవి, పెద్దివర్ గంగాధర్, సంతోష్, పోచన్న, రామన్న, రాజు, లింగన్నతో పాటు గ్రామస్తులు, బీజేపీ నాయకులు, యువమోర్చ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళులు అర్పించారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
