కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలి
– ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
మన భారత్, ఆదిలాబాద్ :
తెలంగాణ కార్మిక హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐకేపీ వీఓఏల సమ్మెకు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల చిన్నన్న మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐకేపీ వీఓఏలు గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ, వారికి సరైన వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం బాధాకరమన్నారు.
వీఓఏలకు కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని, వారిని సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న హార్వులైన వీఓఏలకు సీసీలుగా పదోన్నతులు ఇవ్వాలని కోరారు. గ్రామీణ మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాల అభివృద్ధిలో వీఓఏలు కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ముందుండి పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
అదేవిధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జిఓ నంబర్ 58లో సవరణలు చేయాలని లింగాల చిన్నన్న డిమాండ్ చేశారు. వీఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు సేవలు అందిస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయిలో ప్రజలకు చేరవేసే బాధ్యతలను వీఓఏలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ, వారి సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడం విచారకరమని అన్నారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత కార్యక్రమాల్లో వారి సేవలను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తాజోద్దీన్, రాజేష్, అరుణ్, వినోద్, సమత, అరుణ తదితరులు పాల్గొని వీఓఏల డిమాండ్లకు మద్దతు తెలిపారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
