మన భారత్, అనంతపూర్ జిల్లా | తాడిపత్రి :
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రిలో PACS ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తాడిపత్రి ఏడీసీసీ బ్యాంక్ శాఖ పరిధిలో పనిచేస్తున్న సహకార సంఘాల సీఈవోలు, సిబ్బంది, ఉద్యోగులు సోసైటీ బ్యాంకు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 322 కాపీలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా PACS ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా జనరల్ సెక్రటరీ డి. శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 322 ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం కలిగించడంలేదని విమర్శించారు. ఉద్యోగులకు ప్రకటించిన 20 శాతం వేతన పెంపును బేసిక్ పేలో విలీనం చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. వేతనాల పెంపు పేరుతో ఉద్యోగులను తప్పుదోవ పట్టించారని అన్నారు.
అలాగే NABARD “Capacity to Pay” నిబంధనలను చూపిస్తూ ఉద్యోగుల హక్కులను పరిమితం చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహకార సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సేవా భద్రత, వేతన రక్షణపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం అమల్లో ఉన్న జీవో నెంబర్ 322ను వెంటనే రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం జరిగేలా కొత్త జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల పోరాటానికి సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. మండల అధ్యక్షుడు ఉమా గౌడ్ పాల్గొని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసిన ఉద్యోగులు జీవో ప్రతులను దహనం చేస్తూ ప్రభుత్వ వైఖరిని నిరసించారు.
ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి PACS ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు:
- జీవో నెంబర్ 322ను వెంటనే రద్దు చేయాలి
- PACS ఉద్యోగులకు న్యాయం జరిగే కొత్త జీవో విడుదల చేయాలి
- 20 శాతం హైక్ను బేసిక్ పేలో కలపాలి
- ఉద్యోగుల వేతన, సర్వీస్ భద్రత కల్పించాలి
- NABARD నిబంధనల పేరుతో ఉద్యోగుల హక్కులను తగ్గించకూడదు
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
