మన భారత్, మొగుళ్లపల్లి:
గౌడ సమాజానికి చెందిన కార్మికుల ప్రాణాలు తాటిచెట్లపై ప్రమాదాలకు బలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పిడిసిల్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నేరెళ్ల మొగిలి గౌడ్ (50) తాటిచెట్టుపై పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో పిడిసిల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి ఏకైక ఆదారంగా ఉన్న మొగిలి గౌడ్ మృతి చెందడంతో వారి కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక కష్టాల్లో పడింది. గౌడ వృత్తినే జీవనాధారంగా చేసుకున్న అనేక కుటుంబాలు ఇలాంటి ప్రమాదాలకు గురవుతూ జీవన సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయి.
తాటిచెట్లపై ఎక్కి కష్టపడి జీవనం సాగించే గౌడన్నలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ, భద్రతా చర్యలు సరిపోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, గౌడ సమాజం డిమాండ్ చేస్తున్నారు.
మృతి చెందిన మొగిలి గౌడ్ కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే గౌడ వృత్తిలో ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని, భద్రతా పరికరాలు అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ ఘటన మరోసారి గ్రామీణ కార్మికుల భద్రత, సంక్షేమంపై ప్రశ్నలు లేవనెత్తింది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
