మన భారత్, మొగుళ్ళపల్లి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హమాలీ కార్మిక సంఘం అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఎర్రజెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం జరిగిన చారిత్రక పోరాటాల ఫలితంగానే మేడే ప్రాముఖ్యత ఏర్పడిందని అన్నారు. 140 సంవత్సరాల క్రితం కార్మికులు ఎదుర్కొన్న అన్యాయ పరిస్థితులను గుర్తుచేస్తూ, అప్పట్లో పనిగంటలు, సరైన వేతనాలు లేకపోవడం, కార్మికులను దోపిడీ చేయడం వంటి సమస్యలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం ఐక్యంగా పోరాడిందని వివరించారు.
ఎనిమిది గంటల పని దినం, సముచిత వేతనాలు, స్త్రీ-పురుష సమానత్వం వంటి హక్కులను సాధించేందుకు కార్మికులు చేసిన త్యాగాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ప్రస్తుతం కూడా అనేక రంగాల్లో కనీస వేతనాల అమలు లేకపోవడం, పనిగంటల పెంపు వంటి సమస్యలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ విధానాలకు అనుకూలంగా కార్మిక చట్టాలలో మార్పులు జరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో కార్మికుల ఐక్యత మరింత బలపడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి సంఘటిత పోరాటమే మార్గమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో హమాలీ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు మల్లయ్య, కోశాధికారి కొమురయ్య, సభ్యులు ఓంకార్, ఆదిరెడ్డి, సంపత్ రావు, సంజీవరెడ్డి, చంద్రు, మల్లారెడ్డి, అజయ్, రాజు, రాజయ్య, ఐలయ్య, క్రాంతి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
