మన భారత్, ఆదిలాబాద్:
ఆర్టీసీలో ప్రయాణికులకు టికెట్లు జారీ చేయడానికి ప్రవేశపెట్టిన టికెట్ ఇష్యూ యింగ్ మిషన్లు (TIM) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సమస్యలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన నెట్వర్క్ సౌకర్యం లేకపోవడంతో ఈ యంత్రాలు సక్రమంగా పనిచేయక కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో సెల్ టవర్ల కొరత కారణంగా TIM యంత్రాలు పనిచేయకపోవడంతో కటాఫ్ పాయింట్లలోపు టికెట్లు జారీ చేయడం కష్టంగా మారింది. దీంతో తనిఖీ అధికారుల ముందు కండక్టర్లు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయాణికులకు సకాలంలో టికెట్లు ఇవ్వలేకపోవడం వల్ల సేవలపై ప్రతికూల ప్రభావం పడుతోందని, దీనికి తక్షణ పరిష్కారం అవసరమని వారు కోరుతున్నారు. ముఖ్యంగా నెట్వర్క్ లేని ప్రాంతాల్లో గతంలో అమలులో ఉన్నట్లుగా ముద్రిత టికెట్లు అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ సమస్యపై అధికారులు దృష్టి సారించి, ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్వర్క్ సదుపాయాలను మెరుగుపరచాలని, లేకపోతే ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేయాలని స్థానికులు, సిబ్బంది సూచిస్తున్నారు.
