మన భారత్, ఎడ్యుకేషన్:
Kakatiya University నిర్వహించే డిగ్రీ పరీక్షలు ఈ నెల 20వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షలకు కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఇప్పటివరకు హాల్ టికెట్లు విడుదల కాకపోవడం సమస్యగా మారింది.
హాల్ టికెట్లు లేకుండా పరీక్షలకు ఎలా హాజరుకావాలనే అనుమానంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. చివరి నిమిషంలో హాల్ టికెట్లు విడుదల అవుతాయనే సమాచారం రావడంతో, ఒక్క రోజులోనే వాటిని సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు.
ఇక మండుటెండల మధ్య పరీక్షలు నిర్వహించడంపై కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన సమయానికి హాల్ టికెట్లు అందించకపోవడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని పేర్కొంటున్నారు. యూనివర్సిటీ అధికారులు ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఈ ఆలస్యం విద్యార్థులపై ప్రభావం చూపుతోందని అభిప్రాయపడుతున్నారు.
పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని, వెంటనే హాల్ టికెట్లు విడుదల చేసి విద్యార్థుల ఆందోళన తొలగించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
