మన భారత్, ఆదిలాబాద్:
తలమడుగు మండల కేంద్రంలో ఉన్న 33/11 కేవీ విద్యుత్ లైన్ స్థానిక ప్రజలకు ప్రాణాంతకంగా మారిందని నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్స్టేషన్ నుండి సరఫరా అవుతున్న ఈ హై వోల్టేజ్ లైన్ దాదాపు 15 నుంచి 20 ఇళ్ల మధ్యగా, ఇళ్లపైగానే వెళ్లడం వల్ల రోజువారీ జీవనంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు.
స్థానికుల వివరాల ప్రకారం, హై వోల్టేజ్ ప్రభావంతో టీవీలు, ఫ్రిజ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు తరచూ షార్ట్ సర్క్యూట్కు గురై దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోందని, చిన్నపాటి వర్షానికే వైర్ల నుంచి స్పార్కింగ్ జరుగుతుందని చెబుతున్నారు.
ఇళ్లపై ఎలాంటి పనులు చేయలేని పరిస్థితి నెలకొనడంతో పాటు, బట్టలు ఆరేసేందుకు కూడా భయపడాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు తెలియక పైకప్పులపైకి వెళ్లే సందర్భాల్లో పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇళ్లలో బాత్రూమ్లు, టిన్ షీట్లు కూడా విద్యుత్ ప్రభావంతో ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొన్నారు.
ఈ సమస్యపై ఎన్నోసార్లు విద్యుత్ శాఖ అధికారులకు, మండల అధికారులకు విన్నవించినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు విమర్శించారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల సమయంలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపించారు.
రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఓట్లు అడగడానికి వచ్చే నాయకులకు తగిన సమాధానం ఇస్తామని స్థానికులు హెచ్చరించారు. తక్షణమే ఈ ప్రమాదకర విద్యుత్ లైన్ను మార్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు.
