ఆదిలాబాద్, మన భారత్:
ఆదిలాబాద్ జిల్లా పిప్రి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి, విద్య, నీటిపారుదల, రహదారులు, విద్యుత్ రంగాల్లో భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని అడేగామాలో రూ. 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే పొచ్చెర గ్రామంలో రూ. 45 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి కూడా పునాది వేశారు.
ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధిలో భాగంగా శ్రీ నాగోబా దేవస్థానం అభివృద్ధి, సుందరీకరణ పనులకు రూ. 20 కోట్లతో శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల & జూనియర్ కళాశాల (బాలికలు) భవనాన్ని ప్రారంభించారు.
మౌలిక వసతుల విస్తరణలో భాగంగా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో రూ. 13 కోట్లతో నిర్మించిన వంతెనను ప్రారంభించగా, ఉట్నూర్లో ఐటీడీఏ నూతన భవనానికి రూ. 15 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఇచ్చోడ నుంచి డెడ్రా గ్రామం వరకు రూ. 30 కోట్లతో రహదారి నిర్మాణ పనులకు కూడా పునాది వేశారు.
విద్యా రంగంలో జైనథ్లో మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాల (బాలురు) భవనాన్ని ప్రారంభించగా, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో రూ. 30 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. విద్యుత్ రంగంలో భాగంగా ధన్నూర్, కుప్టి, కుచ్లాపూర్ గ్రామాల్లో 33/11KV ఉపకేంద్రాల నిర్మాణానికి రూ. 8.99 కోట్లతో శంకుస్థాపన చేశారు.
నీటిపారుదల రంగంలో భాగంగా పిప్రి, తేజాపూర్, ముత్నూర్ ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల కోసం రూ. 50.70 కోట్లు, రూ. 44.64 కోట్లు, రూ. 65.85 కోట్లతో శంకుస్థాపనలు చేశారు. అదనంగా లాండసాంగి చెక్ డ్యాం, చిక్ మన్ వాగు ప్రాజెక్ట్, అమ్మనమడుగు వాగు మరమ్మతుల పనులకు కూడా కోట్ల రూపాయల నిధులతో శ్రీకారం చుట్టారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అధికారులు, ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
