మన భారత్, జయశంకర్ భూపాలపల్లి:
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యలపై కీలక సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలువురు రైతులు పాల్గొని తమ సమస్యలను వెల్లడించారు.
రైతులు మాట్లాడుతూ, వర్షాకాలం వరి పంటకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన బోనస్ డబ్బులు ఇప్పటివరకు తమ బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు వ్యవసాయ అధికారులను, బ్యాంకులను సంప్రదించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని తెలిపారు. కలెక్టర్కు కూడా వినతిపత్రాలు సమర్పించినప్పటికీ స్పందన రాలేదని వాపోయారు.
ఈ విషయంపై స్పందించిన రవి పటేల్, కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల హామీలలో భాగంగా సన్నవల పంటలకు క్వింటాల్కు ₹500 బోనస్ ఇస్తామని ప్రకటించి ఇప్పటివరకు అమలు చేయకపోవడం బాధాకరమని విమర్శించారు. రైతులను అధికారుల చుట్టూ తిప్పించడం అన్యాయమని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్, సంబంధిత వ్యవసాయ అధికారులు తక్షణమే స్పందించి రైతుల బోనస్ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ప్రకృతి ఒడిదుడుకులను ఎదుర్కొని పంట పండించిన రైతులకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అని, రైతులకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పార్టీ అండగా ఉంటుందని రవి పటేల్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని రవి పటేల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
