మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా రాష్ట్రపతిని కలిసి పలు అంశాలపై చర్చించారు.

రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రాంతీయ అభివృద్ధికి సంబంధించిన విషయాలు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ప్రజలకు ఉపయోగపడే పలు సంక్షేమ పథకాల అమలు, పార్లమెంట్ నియోజకవర్గాల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై రాష్ట్రపతికి వివరించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్రపతిని కలిసిన సందర్భంగా దేశవ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించినట్లు ఎంపీలు తెలిపారు. ఈ సమావేశం సౌహార్ద వాతావరణంలో సాగింది.

