మన భారత్ , ఆదిలాబాద్:
తాత మందలించాడనే ఆగ్రహంతో మనవడు పొలంలో ఉన్న పంటకు నిప్పు పెట్టిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలంలో కలకలం రేపింది. మండలంలోని పెండల్వాడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే రైతు తన మనవడు సునీల్ పనీపాటా లేకుండా గ్రామంలో జులాయిగా తిరుగుతున్నాడని మందలించినట్లు తెలుస్తోంది. పెద్దల మాట వినకుండా తిరుగుతున్నాడని ఆగ్రహంతో మందలించడంతో సునీల్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడు.
తాత మందలింపుతో కోపోద్రిక్తుడైన సునీల్, ఇంటి వద్ద ఉన్న పొలానికి వెళ్లి అక్కడ కుప్పగా పోసి ఉంచిన శనగ పంటకు నిప్పు పెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. మంటలు చెలరేగడంతో కళ్లముందే పంట మొత్తం బూడిదైపోయింది. కష్టపడి పండించిన పంట నాశనం కావడంతో రైతు ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై ప్రభాకర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫిర్యాదు మేరకు సునీల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబంలో జరిగిన చిన్న గొడవ ఇలా పెద్ద నష్టానికి దారి తీసిన ఘటనపై గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువతలో సహనం, బాధ్యతాభావం పెరగాల్సిన అవసరం ఉందని స్థానిక పెద్దలు సూచిస్తున్నారు

