మన భారత్ , ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని వైద్యులు నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు కలిసి ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ ఆరోగ్య శిబిరంలో స్థానిక ఆసుపత్రి సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గ్రామస్తులు, యువతీ యువకులు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైద్యులు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.

పరీక్షల సందర్భంగా కొంతమంది రోగులకు ప్రత్యేక వైద్య చికిత్స అవసరమని గుర్తించిన వైద్యులు, వారికి మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్కు రిఫర్ చేశారు. అవసరమైన వారికి ఉచిత చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటామని డాక్టర్ల బృందం తెలిపింది.

ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఎండాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, యువత డీహైడ్రేషన్ సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అందువల్ల రోజంతా తగినంత నీరు తాగడం, ఎండలో ఎక్కువసేపు తిరగకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

బాలింతల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల 15 రోజులకోసారి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. గ్రామాల్లో ఆరోగ్య అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సర్పంచ్, ఐకెపి సిబ్బంది, ఆశా వర్కర్లు, స్థానిక యువత, గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
