మన భారత్, న్యూఢిల్లీ :
రాష్ట్రాల మధ్య వాహనాల బదిలీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. అంతర్రాష్ట్ర వాహనాల బదిలీ సమయంలో ఎదురవుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని కొత్త విధానాన్ని అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది.

ఇప్పటివరకు ఒక రాష్ట్రంలో రిజిస్టర్ అయిన వాహనాన్ని మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటే ముందుగా ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవాల్సి ఉంటుంది. వాహనానికి సంబంధించిన రోడ్ ట్యాక్స్, ట్రాఫిక్ చలాన్లు, ఇతర బకాయిలు లేకపోతేనే NOC జారీ చేస్తారు. ఆ తర్వాత ఆ ధృవీకరణ పత్రాన్ని కొత్త రాష్ట్రంలోని RTO కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టడం వల్ల వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు NITI Aayog చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ సిఫార్సు అమలులోకి వస్తే వాహనాల బదిలీకి పాత రాష్ట్రం నుంచి NOC తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
కొత్త విధానం ప్రకారం VAHAN Portal ద్వారా ఆటో జనరేటెడ్ క్లియరెన్స్ సిస్టమ్ అమలులోకి తీసుకురానున్నారు. ఈ విధానంతో వాహనానికి సంబంధించిన పన్నులు, చలాన్లు, ఇతర వివరాలు డిజిటల్గా పరిశీలించి వెంటనే అనుమతి ఇవ్వడం జరుగుతుంది.

దీంతో వాహనాల బదిలీ ప్రక్రియ వేగవంతం అవడంతో పాటు పౌరులకు సమయం, శ్రమ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే దేశవ్యాప్తంగా వాహన యజమానులకు భారీ ఉపశమనం కలగనుంది.
