బంగాళాఖాతంలో బలహీనపడిన వాయుగుండం.. ఏపీలో వర్షాలు
మన భారత్, ఆంధ్రప్రదేశ్: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా బలహీనపడింది. శనివారం శ్రీలంకలోని ముల్లయిట్టివు సమీపంలో తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం ముల్లయిట్టివుకు సుమారు 30 కిలోమీటర్లు, చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం నాటికి ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో ఆదివారం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు తమిళనాడు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

వచ్చే మూడు రోజులు తీవ్ర చలి.. హెచ్చరికలు జారీ
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు తీవ్ర చలి కొనసాగే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న దిగువ స్థాయి గాలుల ప్రభావంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ మధ్యనే నమోదయ్యే అవకాశముందని తెలిపారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రంగా ఉండనుందని, వృద్ధులు, చిన్నపిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే వేడి దుస్తులు ధరించాలని, చలి సంబంధిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
