మన భారత్, జాజాపూర్, ఆగస్టు 21: విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనా విధానం, సమస్యలను గుర్తించి పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇన్క్వి-ల్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆగస్టు 19, 20 తేదీల్లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాలుగు పాఠశాలలకు చెందిన విద్యార్థి నాయకులకు ప్రత్యేక శిక్షణ అందించారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తిని పెంపొందించడంతో పాటు, తమ చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించడం, వాటిపై విశ్లేషణ చేయడం, వినూత్న పరిష్కారాలను ఆలోచించడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కేవలం పాఠ్యపుస్తక పరిజ్ఞానాన్ని పెంపొందించడం మాత్రమే కాకుండా, ఆలోచించడం, ప్రశ్నించడం, ప్రయోగాలు చేయడం, సమస్యలకు స్వయంగా పరిష్కారాలు కనుగొనే సామర్థ్యాన్ని పెంచడం ఎంతో అవసరమన్నారు. ఈ దిశగా ఇన్క్వి-ల్యాబ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న “థింక్ అండ్ మేక్” కార్యక్రమం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఇన్క్వి-ల్యాబ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఆచరణాత్మక అభ్యాసాన్ని పెంపొందించేందుకు “Think and Make” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 15 పాఠశాలల్లో అమలు చేసిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో 23 పాఠశాలలకు విస్తరించినట్లు వివరించారు.
జాజాపూర్ పాఠశాలలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణలో విద్యార్థి నాయకులు వివిధ ప్రాక్టికల్ సెషన్లు, కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తమ చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి సాధ్యమైన పరిష్కారాలను ఆలోచించడం, సృజనాత్మక పద్ధతుల్లో నమూనాలను రూపొందించడం వంటి అంశాలను ఆచరణాత్మకంగా నేర్చుకున్నారు. శిక్షణ ద్వారా విద్యార్థుల్లో సమస్యలను కొత్త కోణంలో చూసే సామర్థ్యం, స్వతంత్రంగా ఆలోచించే నైపుణ్యం, బృందంగా పనిచేసే లక్షణాలు పెంపొందుతాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన విద్యార్థి నాయకులు తమ పాఠశాలలకు తిరిగి వెళ్లిన అనంతరం తోటి విద్యార్థులకు తాము నేర్చుకున్న అంశాలను వివరించనున్నారు. తద్వారా ఒక విద్యార్థి నుంచి మరో విద్యార్థికి జ్ఞానం, ఆలోచనలు విస్తరించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. విద్యార్థులు పరస్పరం నేర్చుకుంటూ సమస్యలను గుర్తించడం, ప్రశ్నించడం, ప్రయోగించడం, ఆలోచనలను నమూనాలుగా రూపొందించడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు, భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా, వినూత్నంగా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. పాఠ్యాంశాలతో పాటు ఆచరణాత్మక అభ్యాసానికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమానికి ట్రైనర్లుగా ప్రవస్తి, శివ, వాలంటీర్లుగా సులోచన, మౌనిక వ్యవహరించారు. ఉపాధ్యాయులు భానుప్రకాష్, కవిత, శశిరేఖ, స్వప్న, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు విద్యార్థులు ఉత్సాహంగా శిక్షణలో పాల్గొని వివిధ కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేశారు.
మీ విశాల్ కుమార్ మన భారత్ చీఫ్ ఎడిటర్ న్యూఢిల్లీ
తెలుగు రాష్ట్రాల్లో జిల్లాల స్టాఫ్ రిపోర్టర్ లతో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
