ప్రజాస్వామ్య రక్షణకై ఓటు హక్కును కాపాడుకోవాలి
-సర్ సవరణలో ప్రజలంతా భాగస్వాములుకండి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
-18 ఏళ్లు నిండిన యువత వంద శాతం ఓటు హక్కును పొందాలి
-బూత్ స్థాయిలో సామాజిక కార్యకర్తలు,యువత పాల్గొని బీఎల్ఓలతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కును కల్పించాలి
-మొగుళ్ళపల్లి తహసిల్దార్ జాలీ సునీతా రెడ్డి
మన భారత్,మొగుళ్ళపల్లి:
భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ పై చైతన్యం తీసుకురావడానికి, నకిలీ ఓట్లను అరికట్టడానికి ఇంటింటి ప్రత్యేక సమగ్ర సవరణ పక్రియ విజయవంతంగా కొనసాగుతుందని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో నేటి వరకు 65 శాతం ఎన్యూమరేషన్ దరఖాస్తులను ఆన్లైన్ చేయడం జరిగిందని తహసిల్దార్ జాలీ సునీతా రెడ్డి తెలిపారు. మంగళవారం తన చాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నుముక లాంటి ఓటరు జాబితాను పారదర్శకంగా తయారు చేయడమే ఈ ప్రత్యేక సర్వే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. గతంలో జరిగిన అక్రమాలను అరికట్టడానికి, అర్హులైన ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండడానికి బూత్ లెవల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని బీఎల్ఓలను కోరారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాల వయస్సు నిండే ప్రతి ఒక్క యువతీ, యువకుడు తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలనీ, రాబోయే భవిష్యత్తును నిర్ణయించే శక్తి యువత చేతుల్లోనే ఉందనీ స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు తొలగించి, అలాగే ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల ఉన్న నకిలీ ఓట్లను గుర్తించి, ఒక్క చోట మాత్రమే ఓటు ఉండే విధంగా అధికారులు చూడాలన్నారు. బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ప్రజలు పూర్తి సమాచారం అందించి వారికి సహకరించాలనీ కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని బూత్ స్థాయి అధికారులకు తెలిపారు. అదే విధంగా వార్డుల్లో ఉన్న నిరక్షరాస్యులకు, వృద్ధులకు ఓటు హక్కు పరిశీలనలో సామాజిక కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ సైనికులుగా ఉండి ప్రజలకు తోడ్పాటు అందించాలని తెలిపారు. అంతేకాకుండా, యువకులు, ప్రజలు తమ స్మార్ట్ఫోన్ ద్వారా కూడా ఓటు హెల్ప్ లైన్ అప్ లేదా కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ voters.eci.gov.in లో స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల సమయం 10 రోజుల గడువు మాత్రమే ఉంది. కాబట్టి చివరి రోజులలో సర్వర్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉన్నందున ఈనెల 20 లోపు అందరూ ఎన్యూమరేషన్ దరఖాస్తులను నింపి మీ యొక్క బీఎల్ఓలకు అందజేయాలన్నారు. గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు, బీఎల్ఏ, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి అధికారులు, యువకులు ముఖ్యంగా వార్డు మెంబర్లు మీ పరిధిలో ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వని వారిని గుర్తించి, వారిచే ఫారం నింపించి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలని, గ్రామస్థాయిలో అందరూ సహకరించి సర్ ను విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పని చేయుటకు జిల్లా స్టాప్ రిపోర్టర్,మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను.
