ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేముల మహేందర్ గౌడ్ సూటి ప్రశ్న?
మన భారత్ మొగుళ్ళపల్లి:
రాష్ట్రంలోని 14 లక్షల మంది పేద విద్యార్థుల చదువుల కంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మూసీ సుందరీకరణే ముఖ్యమా? అని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా రూ.7,000 కోట్ల ఫీజుల బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపించారు. పేద విద్యార్థుల ఫీజులకు రూపాయి ఇవ్వని ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ మొదటి దశ కోసం రూ.7,345 కోట్లు ఎలా విడుదల చేసిందన్నారు. ఫీజులు రాక కాలేజీ యజమాన్యాలు హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఆపేస్తుండడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై బీసీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ బీసీ నాయకులు ఒత్తిడి తేవాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.
