ప్రహరీ గోడ, మరుగుదొడ్లు లేక విద్యార్థుల ప్రాణాలకు ముప్పు
తలమడుగు ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా నిలిచిన పనులు
– వెంటనే పూర్తి చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తుల డిమాండ్
మన భారత్, ఆదిలాబాద్:
తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో పాటు మరుగుదొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భద్రతకు అత్యంత కీలకమైన ప్రహరీ గోడ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో పాఠశాల ఆవరణ భద్రత ప్రశ్నార్థకంగా మారిందని వారు పేర్కొన్నారు.
ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణను సంప్రదించగా, ప్రహరీ గోడ నిర్మాణ పనులను ఒక స్థానిక ప్రజాప్రతినిధికి అప్పగించినట్లు తెలిపారు. పనులు పూర్తి చేయాలని పలుమార్లు కోరినా ఎలాంటి స్పందన లేకపోవడంతో నిర్మాణం నిలిచిపోయిందన్నారు. అలాగే ఈ పనులకు సంబంధించి ఎంపీడీవో కార్యాలయం నుంచి ఇప్పటికే మంజూరు పత్రం (సాంక్షన్ లెటర్) కూడా జారీ అయినట్లు వివరించారు.
పాఠశాలలో మరుగుదొడ్లు అందుబాటులో లేకపోవడంతో విరామ సమయంలో విద్యార్థులు పాఠశాల ప్రహరీ దాటి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రహదారి దాటి మూత్ర విసర్జనకు వెళ్లడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విద్యార్థులు రైల్వే ట్రాక్ సమీపానికి వెళ్లి మూత్ర విసర్జన చేస్తున్నారని, ఇది అత్యంత ప్రమాదకర పరిస్థితికి దారితీస్తోందని వారు పేర్కొన్నారు.
పిల్లల భద్రత, పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా వెంటనే ప్రహరీ గోడ నిర్మాణాన్ని పూర్తి చేసి, అవసరమైన మరుగుదొడ్లను నిర్మించాలని గ్రామస్తులు, తల్లిదండ్రులు ప్రభుత్వ అధికారులను, స్థానిక ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ఆలస్యం జరిగితే ఎప్పుడైనా ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు విద్యార్థుల భద్రతకు అత్యంత అవసరమని, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కూడా పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మరుగుదొడ్ల కొరత విద్యార్థుల భద్రత, పరిశుభ్రతపై ప్రభావం చూపుతోందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
