మన భారత్ | ఆదిలాబాద్
తెలంగాణ రక్షణ సేనలో 30 మంది యువకుల చేరిక – పార్టీ బలోపేతానికి కృషి: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అబ్జర్వర్, బోథ్ నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్చోడా మండలంలోని గుండాల గ్రామానికి చెందిన సుమారు 30 మంది యువకులు, గ్రామ పెద్దలు తెలంగాణ రక్షణ సేనలో చేరారు.
పార్టీలో చేరిన వారికి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రజా సమస్యల పరిష్కారమే తెలంగాణ రక్షణ సేన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పార్టీలో చేరుతున్న యువతను స్వాగతిస్తూ, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
యువత రాజకీయాల్లో చైతన్యంతో ముందుకు రావడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామమని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం నిరంతరం పోరాడే పార్టీగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ షేక్ బిలాల్, షేక్ కాలీం, షేక్ పరీద్, మరుతీ పటేల్, ముస్తాప, మొహమ్మద్, నవాజ్ ఖాన్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సభ్యత్వ కార్యక్రమంతో బోథ్ నియోజకవర్గ పరిధిలో తెలంగాణ రక్షణ సేనకు గ్రామీణ స్థాయిలో మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
