దొడ్డి కొమురయ్య త్యాగస్ఫూర్తి చిరస్మరణీయం
– వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మన భారత్, ఆదిలాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొని దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రైతుల హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన దొడ్డి కొమురయ్య తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మహనీయుడని పేర్కొన్నారు. ఆయన చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
తెలంగాణ రైతాంగ ఉద్యమానికి దొడ్డి కొమురయ్య త్యాగం కొత్త దిశను చూపిందని, ఆయన బలిదానం ప్రజల్లో స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడే సంకల్పాన్ని బలోపేతం చేసిందని ఎమ్మెల్యే వివరించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, రాష్ట్ర ఆత్మగౌరవ పరిరక్షణలోనూ అమరవీరుల సేవలు ఎనలేనివని పేర్కొన్న ఎమ్మెల్యే, వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయడం ద్వారా నిజమైన నివాళి అర్పించినవారమవుతామని చెప్పారు.
కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొని దొడ్డి కొమురయ్య సేవలను స్మరించుకున్నారు.
