తలమడుగులో కౌలు రైతుల గళం
– గుర్తింపు, పంట రుణాలు, బీమా కోసం తహసీల్దార్కు వినతిపత్రం
మన భారత్ | తలమడుగు | జూలై 2, 2026
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలో గురువారం కౌలు రైతుల సాధన కమిటీ ఆధ్వర్యంలో కౌలు రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 22 జిల్లాల్లో నిర్వహించిన కౌలు రైతుల సర్వే నివేదికను రైతులతో కలిసి విడుదల చేశారు. సర్వేలో వెలుగులోకి వచ్చిన అంశాలను రైతులకు వివరించి, ప్రస్తుతం కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
సమావేశంలో మాట్లాడుతూ, భూమిని సాగు చేస్తున్నప్పటికీ అధికారిక గుర్తింపు లేకపోవడం వల్ల కౌలు రైతులు అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా పంట రుణాలు, పంట బీమా, రైతు భరోసా, ప్రకృతి విపత్తుల నష్టపరిహారం, ఇతర వ్యవసాయ ప్రోత్సాహక పథకాల లబ్ధి కౌలు రైతులకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం కౌలు రైతులు మండల తహసీల్దార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కౌలు రైతులకు అధికారిక గుర్తింపు కల్పించి, రైతులతో సమానంగా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సాధన కమిటీ సభ్యులు మేకల రమాకాంత్, ఆవుల రాకేష్ పాల్గొన్నారు. రైతులు ప్రేమేందర్ రెడ్డి, పద్మాకర్ రెడ్డి, అల్లూరి స్వామి, నరేష్, సురేందర్, పోచన్న, శంకర్ తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వెల్లడించారు.
కౌలు రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, సాగు చేసే ప్రతి రైతుకు సమాన హక్కులు కల్పించాలని సమావేశంలో పాల్గొన్న రైతులు విజ్ఞప్తి చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
