అసంపూర్తిగా గ్రామ పంచాయతీ భవనం
వెంటనే నిధులు మంజూరు చేయాలి
నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి: సర్పంచ్ సిడం శైలజ రవి
మన భారత్, తలమడుగు:
మండలంలోని కోసాయి గ్రామంలో అసంపూర్తిగా నిలిచిపోయిన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని గ్రామ సర్పంచ్ సిడం శైలజ రవి డిమాండ్ చేశారు. కోసాయి గ్రామం తలమడుగు మండల పరిధిలోని గ్రామ పంచాయతీగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం నాలుగేళ్లుగా పూర్తికాకుండా నిలిచిపోయిందన్నారు. భవనం అసంపూర్తిగా ఉండటంతో గ్రామస్థులకు సంబంధించిన అధికారిక కార్యక్రమాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ప్రస్తుతం పాత గ్రామ పంచాయతీ భవనంలోనే పరిపాలనా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త భవన నిర్మాణం త్వరగా పూర్తి కావాల్సిన అవసరం ఉందన్నారు.
అసంపూర్తిగా ఉన్న భవనాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. గ్రామ అభివృద్ధికి కీలకమైన పంచాయతీ భవనం పూర్తయితే ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేసి నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సిడం శైలజ రవి విజ్ఞప్తి చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
