అంగన్వాడీ టీచర్ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరెస్ట్
ఆర్టీఐ పేరుతో వేధింపులు.. రూ.50 వేల డిమాండ్ చేసినట్లు ఆరోపణలు
మన భారత్, బోథ్:
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో అంగన్వాడీ టీచర్ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీఐ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వేధింపులకు పాల్పడ్డాడని వచ్చిన ఫిర్యాదు మేరకు బోథ్ పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సొనాల మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాథోడ్ రాజు జన్నారం మండలంలో విధులు నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ రాథోడ్ విమలను కొంతకాలంగా ఉద్యోగపరంగా ఇబ్బందులకు గురిచేస్తూ, ఆర్టీఐ చట్టం ద్వారా ఆమె వ్యక్తిగత, ఉద్యోగ వివరాలు సేకరించి ఉద్యోగానికి నష్టం కలిగేలా చేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ బెదిరింపుల నుంచి తప్పించుకోవాలంటే రూ.50 వేల నగదు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఆమె కుమారుడు శ్రీనివాస్ బోథ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన బోథ్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు రాథోడ్ రాజును అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు బోథ్ సీఐ డి. గురుస్వామి తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ డి. గురుస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు తమ హోదాను, చట్టాలను దుర్వినియోగం చేస్తూ ప్రజలను బెదిరించడం లేదా అక్రమంగా డబ్బులు డిమాండ్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇలాంటి ఘటనల్లో ఎవరైనా బాధితులు ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజలకు న్యాయం జరిగేలా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
