సంక్షేమ పథకాల అమలుపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ పెంచాలి: కలెక్టర్ రాజర్షి షా
అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
మన భారత్, ఆదిలాబాద్:
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, లేబర్ కార్డుల మంజూరు, ఇతర సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం సక్రమంగా అందుతోందా లేదా అనే అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.
వివిధ శాఖల అధికారులు తమ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించాలని, వాటికి తక్షణ పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువయ్యేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
జిల్లాలో సంక్షేమ పథకాల పారదర్శక అమలు, అర్హులకు ప్రయోజనాలు అందించడం ప్రధాన లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.
