మన భారత్, తాంసి
తాంసి దళిత బంధు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్కు మెమోరాండం సమర్పించిన రైతులు
– సానుకూలంగా స్పందించిన అధికారులు
తాంసి, జూన్ 5: ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన దళిత బంధు లబ్ధిదారులు తమకు ఇప్పటివరకు కరెంటు మోటార్లు, విద్యుత్ లైన్లు అందకపోవడంతో ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు గ్రామానికి చెందిన దళిత బంధు రైతులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్కు మెమోరాండం సమర్పించారు.
రైతుల వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన సుమారు పది మంది దళిత బంధు లబ్ధిదారులు ప్రభుత్వ పథకం కింద అర్హత సాధించినప్పటికీ, ఇప్పటివరకు కరెంటు మోటార్లు మరియు అవసరమైన విద్యుత్ కనెక్షన్లు అందలేదు. వ్యవసాయానికి నీటి సౌకర్యం అత్యంత కీలకమైన సమయంలో విద్యుత్ మోటార్లు లేకపోవడం వల్ల పంటల సాగులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మెమోరాండం స్వీకరించిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ప్రభాకర్ మాట్లాడుతూ, దళిత బంధు లబ్ధిదారుల సమస్యను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే అర్హులైన రైతులకు కరెంటు మోటార్లు అందజేయడంతో పాటు, విద్యుత్ లైన్లు లేని ప్రాంతాల్లో కొత్తగా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా తాంసి గ్రామ సర్పంచ్ సాంబ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, దళిత బంధు పథకం ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం కల్పించిన అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా అవసరమైన మౌలిక సదుపాయాలు అందించాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
దళిత బంధు రైతుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే తమకు కరెంటు మోటార్లు, విద్యుత్ కనెక్షన్లు అందుబాటులోకి వచ్చి వ్యవసాయ పనులు సజావుగా సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
