మన భారత్ | తెలంగాణ
ఫేస్ ఐడెంటిఫికేషన్ సమస్యతో ఉపాధి కూలీలకు ఇబ్బందులు – శాశ్వత పరిష్కారం కోరుతున్న కార్మికులు
జనగామ, (మన భారత్):
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద పనిచేస్తున్న కూలీలకు ప్రస్తుతం ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు విధానం కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా గుండు చేయించుకున్న కూలీల ఫోటోలను ఎన్ఎంఎంఎస్ (NMMS) యాప్ గుర్తించకపోవడంతో హాజరు నమోదు కాక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తాజాగా జనగామ జిల్లా కృష్ణాజిగూడెం గ్రామంలో చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గుండు చేయించుకున్న ఓ ఉపాధి కూలీ ఫేస్ ఐడెంటిఫికేషన్ యాప్లో పలుమార్లు ప్రయత్నించినప్పటికీ హాజరు నమోదు కాలేదు. దీంతో వినూత్నంగా తన భార్య జడను వెనుక ఉంచుకుని ఫోటో దిగగా యాప్ అతడిని గుర్తించి హాజరు నమోదు చేసినట్లు సమాచారం.
ఈ ఘటన ప్రస్తుతం ఉపాధి కూలీల్లో చర్చకు దారితీసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూడా గుండు చేయించుకున్న వారు, ముఖాకృతిలో మార్పులు వచ్చిన వారు, వృద్ధులు ఫేస్ రికగ్నిషన్ సమస్యల కారణంగా హాజరు నమోదు చేయించుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
కూలీలు మాట్లాడుతూ, సాంకేతిక లోపాల కారణంగా తమ కూలి డబ్బులు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలో తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయ హాజరు విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సాంకేతికత ప్రజలకు సౌలభ్యం కల్పించాలే గానీ ఇబ్బందులు సృష్టించకూడదని, గ్రామీణ కార్మికుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఎన్ఎంఎంఎస్ యాప్లో అవసరమైన మార్పులు చేపట్టాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.
📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్పై క్లిక్ చేయండి.
