ఆరుగురు వేటగాళ్లపై కేసులు నమోదు
జింక కొమ్ములు, చర్మం, నెమలి ఈకలు స్వాధీనం
మన భారత్ | ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి అక్రమ వేటగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన 30 ప్రత్యేక పోలీసు బృందాలు జిల్లావ్యాప్తంగా ఏకకాలంలో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో తలమడుగు, బోథ్, నేరడిగొండ మండలాల పరిధిలో వన్యప్రాణులను అక్రమంగా వేటాడుతున్న ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో నిందితుల వద్ద నుంచి జింక కొమ్ములు, జింక చర్మం, నెమలి ఈకలు, వేటకు ఉపయోగించే వలలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అడవుల్లో అక్రమంగా వేట నిర్వహిస్తూ వన్యప్రాణుల జీవనానికి ముప్పు కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
జిల్లాలో ఇటీవల వన్యప్రాణుల వేట, అక్రమ రవాణా ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అడవి జంతువులను వేటాడటం చట్టరీత్యా నేరమని, వన్యప్రాణుల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. అడవుల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తోందన్నారు.
అటవీ ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, వేటకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం పోలీసులు, అటవీ శాఖ సంయుక్తంగా మరిన్ని తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
జీవ వైవిధ్యం పరిరక్షణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని అధికారులు తెలిపారు. చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమ వేటకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని స్పష్టం చేశారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి ..
