మన భారత్, హైదరాబాద్:
పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారు బ్యాటరీ సైకిళ్ల (ఈ-సైకిళ్లు) వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంధన వ్యయం తగ్గడంతో పాటు పర్యావరణహిత వాహనాలుగా గుర్తింపు పొందిన ఈ బ్యాటరీ సైకిళ్లకు తెలంగాణలో గణనీయమైన డిమాండ్ ఏర్పడింది.
ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించే విధంగా పలు చర్యలు తీసుకుంటుండటంతో ఈవీ వాహనాల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో తక్కువ దూర ప్రయాణాలకు, రోజువారీ పనులకు, విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు ఈ-సైకిళ్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రధాన పట్టణాల్లో బ్యాటరీ సైకిళ్ల అమ్మకాలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు షోరూమ్ నిర్వాహకులు వెల్లడిస్తున్నారు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయగలగడం, నిర్వహణ ఖర్చులు కూడా తక్కువగా ఉండటం వల్ల వినియోగదారులు వీటిపై ఆసక్తి చూపుతున్నారని పేర్కొంటున్నారు.
డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో కొన్ని షోరూమ్లలో తగినంత స్టాక్ అందుబాటులో లేకపోవడం కూడా కనిపిస్తోంది. వినియోగదారులు ముందస్తు బుకింగ్ చేసుకునే పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో బ్యాటరీ సైకిళ్ల ధరలు సుమారు రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఉండగా, మోడల్, బ్యాటరీ సామర్థ్యం, ఫీచర్లను బట్టి ధరల్లో మార్పులు ఉంటున్నాయి.
ఇంధన ధరల భారం తగ్గించుకోవడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడడం, తక్కువ నిర్వహణ ఖర్చులతో ప్రయాణ సౌకర్యం కలగడం వంటి కారణాలతో బ్యాటరీ సైకిళ్ల వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఈ-సైకిళ్లకు పెరుగుతున్న ఆదరణ రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగానికి కొత్త ఊపునిస్తుందని చెబుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
