డిజిటల్ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు..
119 నియోజకవర్గాలకు ప్రత్యేక బాధ్యుల నియామకం
మన భారత్, హైదరాబాద్, మే 21: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టేందుకు పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ఆధునిక సాంకేతికతతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా ఇన్ఛార్జిలను నియమిస్తూ పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్ఛార్జిలను నియమిస్తూ, సభ్యత్వ నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక డిజిటల్ యాప్ను రూపొందించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాప్ ద్వారా సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ, కార్యకర్తల సమాచారం నమోదు వంటి అంశాలను సులభతరం చేయనున్నారు.
సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తెలంగాణ భవన్లో నియోజకవర్గాల ఇన్ఛార్జిలకు ఐటీ నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో యాప్ వినియోగం, సభ్యత్వ నమోదు విధానం, డేటా అప్డేట్, సాంకేతిక సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు.
తెలంగాణ భవన్లో శిక్షణ పూర్తైన అనంతరం, అదే నమూనాలో జిల్లా పార్టీ కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జిల పర్యవేక్షణలో ఈ శిబిరాలు జరుగుతాయి. జిల్లా స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు సభ్యత్వ నమోదు ప్రక్రియను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది.
అంతేకాకుండా, ప్రతి పోలింగ్ బూత్కు ఇద్దరు చొప్పున కార్యకర్తలకు వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. బూత్ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ కీలకంగా మారనుంది. గ్రామాలు, పట్టణాలు, వార్డులు, డివిజన్ల స్థాయిలో పార్టీ కార్యకర్తలు యాప్ వినియోగంపై పూర్తిస్థాయి అవగాహనతో సభ్యత్వ నమోదు చేపట్టేలా కార్యాచరణ రూపొందించారు.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన తర్వాత సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమాన్ని స్వయంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రారంభించనున్నారు. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా పార్టీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యకర్తల వివరాలను ఒకే డిజిటల్ వేదికపై సమీకరించడం, భవిష్యత్ ఎన్నికల దృష్ట్యా పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్టం చేయడం లక్ష్యంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
