మన భారత్, గజపతినగరం:
గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బూత్ లెవెల్ ఏజెంట్లు, నాయకులు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. శనివారం గజపతినగరం నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో గజపతినగరం, దత్తిరాజేరు మండలాల క్లస్టర్ ఇంచార్జిలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ కార్యకలాపాలు చురుగ్గా కొనసాగించాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో నాయకులు కీలక పాత్ర పోషించాలని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయానికి ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెంచుకోవచ్చని తెలిపారు. పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలపై స్పందించాలని సూచించారు. గ్రామాల్లో పార్టీ పట్ల ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.
నియోజకవర్గ పరిశీలకులు జగన్మోహనరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలే వైసీపీకి బలమని అన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం క్లస్టర్ ఇంచార్జిలు, బూత్ లెవెల్ ఏజెంట్లు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నాయకుడు పార్టీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో రెండు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
