మన భారత్, తలమడుగు :
తలమడుగు మండలంలోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలికలు పదవ తరగతి ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ ఏడాది పరీక్షల్లో పాఠశాల 100శాతం ఉత్తీర్ణత సాధించడం పట్ల ప్రధానోపాధ్యాయులు ఎం. అరుణ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ, గిరిజన బాలికలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన, సాంకేతిక విద్యను అందుకుంటూ అద్భుత ఫలితాలు సాధించడం గర్వకారణమని తెలిపారు. మొత్తం 57 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణత సాధించడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. ఇందులో ముఖ్యంగా 10 మంది విద్యార్థినులు 500కి పైగా మార్కులు సాధించడం పాఠశాల విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
టాప్ మార్కులు సాధించిన విద్యార్థినుల్లో డి. శృతి 521 మార్కులతో ముందంజలో నిలవగా, కె. నెరజాల, కె. సుమిత్ర తలో 513 మార్కులు, ఎం. వైష్ణవి 512, డి. సుప్రజ 509, జి. పల్లవి 508, ఎం. ధనలక్ష్మి 505, ఎస్. కళ్యాణి 504, ఎం. లతా 503, ఏ. శివాని 502 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు.
విద్యార్థినుల విజయంపై హెడ్మాస్టర్ ఎం. అరుణతో పాటు హాస్టల్ వార్డెన్ ఈ. రామన్ అభినందనలు తెలిపారు. క్రమశిక్షణ, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, విద్యార్థినుల కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.
ఈ ఫలితాలతో తలమడుగు మండలానికి మంచి పేరు తీసుకువచ్చిన విద్యార్థినులపై తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
