మన భారత్, మొగుళ్ళపల్లి:
ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ, అవసరమైతే ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసేది పోలీస్ వ్యవస్థేనని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో సైనికులు ఎంత ముఖ్యమో, గ్రామాలు మరియు పట్టణాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అంతే కీలకమని అన్నారు. పోలీసులు లేకపోతే సమాజంలో అశాంతి పెరిగి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఉగ్రవాదులు, తీవ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో సైనికులు, పోలీసులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారని కొనియాడారు.
తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్లోని రికార్డుల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది విధి నిర్వహణపై సమగ్రంగా పరిశీలించారు. నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై సమీక్ష నిర్వహిస్తూ, విచారణలను వేగవంతం చేయాలని సూచించారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
అలాగే వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్టేషన్ ప్రాంగణంలో మొక్క నాటుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ సంపత్ రావు, సీఐ దగ్గు మల్లేష్ యాదవ్, ఎస్ఐ ముప్పు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
