మన భారత్, తెలంగాణ:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం లోక్భవన్లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.
ప్రధానంగా విద్యారంగ అభివృద్ధి, విద్యాసంస్థల్లో మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాలు సమావేశంలో ప్రాధాన్యత పొందాయి. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని గవర్నర్ సూచించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రమాణం చేయించే విధానాన్ని అమలు చేయాలని కూడా సూచించారు.
ఈ నేపథ్యంలో జూన్ 12న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం లో గవర్నర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చర్చించారు. పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ సమయంలోనే విద్యార్థుల నుండి మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రాలు తీసుకునే విధానంపై కూడా సమావేశంలో చర్చ జరిగింది.
గవర్నర్ సూచనలను సానుకూలంగా స్వీకరించిన సీఎం రేవంత్ రెడ్డి, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు రక్షణకు ఈ చర్యలు కీలకమని అభిప్రాయపడ్డారు.
ఈ భేటీతో రాష్ట్రంలో విద్యా రంగంలో సంస్కరణలు, యువతలో అవగాహన కార్యక్రమాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
