మన భారత్, తలమడుగు:
తలమడుగు మండల కేంద్రంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ మాఫ్త్ బిజిలి పథకం ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఈవెంట్ మేనేజర్ వన్నెల సుధీర్ మాట్లాడుతూ గ్రామీణ, మారుమూల గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం పరిమితంగా ఉన్న నేపథ్యంలో సోలార్ విద్యుత్ వినియోగం అత్యంత అవసరమని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో ఇంకా అనేక గిరిజన గ్రామాలకు సరైన విద్యుత్ సరఫరా అందని పరిస్థితి ఉన్నందున, సౌర శక్తి వినియోగం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పథకాల ద్వారా ప్రజలకు సోలార్ ప్యానెల్స్ను అందుబాటులోకి తీసుకువస్తోందని చెప్పారు. 1 కిలోవాట్ సామర్థ్యంతో సోలార్ యూనిట్లకు రూ.55 వేల నుంచి రూ.70 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని, అందులో కేంద్ర ప్రభుత్వం రూ.30 వేల వరకు, రాష్ట్ర మరియు ఇతర వనరుల ద్వారా అదనంగా రూ.25 వేల నుంచి రూ.45 వేల వరకు సహాయం అందుతుందని వివరించారు.
ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాంప్రసాద్, ఆదిలాబాద్ జిల్లా సోలార్ సిస్టమ్ ఇన్చార్జ్ వన్నెల సుధీర్, తలమడుగు గ్రామ సర్పంచ్ ఏలుగు రాజన్న, సెక్రటరీ గజానన్, అలాగే గ్రామస్తులు, యువత పాల్గొన్నారు. కార్యక్రమం ద్వారా ప్రజల్లో సోలార్ విద్యుత్పై అవగాహన పెంపొందించడంతో పాటు, పర్యావరణ హితమైన శక్తి వినియోగం వైపు మళ్లించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సోలార్ విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
