మన భారత్, తలమడుగు:
ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు మండలం కుచులపూర్ గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు కావడంతో గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామస్తులు బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలను తెలియజేశారు.
గ్రామంలో విద్యుత్ సరఫరా సమస్యలు గత కొంతకాలంగా తీవ్రంగా ఉన్నాయని, తరచూ విద్యుత్ అంతరాయాల వల్ల రైతులు, వ్యాపారులు, గృహ వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, కుచులపూర్కు ప్రత్యేక విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు.
సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే విద్యుత్ సరఫరా మెరుగుపడి, వ్యవసాయానికి, చిన్న పరిశ్రమలకు, గ్రామ అభివృద్ధికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన నాయకత్వంలో ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో హర్షాతిరేక వాతావరణం నెలకొనగా, ఎమ్మెల్యేకు మద్దతుగా నినాదాలు చేశారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
