మన భారత్, ఆదిలాబాద్:
పేద కుటుంబాల్లో కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని రైతు వేధికలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. పేద కుటుంబాలకు పెళ్లి ఖర్చులు భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు.

కుమార్తెల వివాహాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మీ పథకం పెద్దగా తోడ్పడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

