105 ప్రయోగాలు, మోడల్స్తో విద్యార్థుల వైజ్ఞానిక ప్రతిభా ప్రదర్శన
మన భారత్, ధన్వాడ:
ధన్వాడ మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొత్తం 105 వరకు ప్రయోగాలు మరియు సైన్స్ మోడల్స్ రూపొందించి ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమాన్ని ధన్వాడ మండల విద్యా అధికారి (MEO), పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి గాయత్రి మేడం గారు సంయుక్తంగా ప్రారంభించారు. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను, శాస్త్రీయ ఆలోచనలను అభినందించారు.

ధన్వాడ మండల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ప్రదీప్ కుమార్ గారు, స్థానిక UPS పాఠశాల విద్యార్థులు, శ్రీ సాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ఈ విజ్ఞాన ప్రదర్శనను సందర్శించి విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రత్యేకంగా సైన్స్ రంగోలి పోటీలు కూడా నిర్వహించడం కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచింది.
ఉత్తమ ప్రదర్శనలు చేసిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన అతిథులు నిత్యజీవితంలో సైన్స్ ప్రాధాన్యతను, మానవ అభివృద్ధిలో శాస్త్ర–సాంకేతిక రంగాలు అందిస్తున్న తోడ్పాటును వివరించారు. విద్యార్థులు ప్రశ్నించే స్వభావం పెంపొందించుకోవాలని, పరిశోధనా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం అంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
