మన భారత్ , ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం..
అసెంబ్లీలో ప్రకటన చేస్తూ సీఎం నలుగురు మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇద్దరు బాధితులు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని, మరో 8 మందికి వైద్యసేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు.
బాధ్యులపై కఠిన చర్యలు
కల్తీ పాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాల వ్యాపారి గణేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఎం వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరైనా బాధ్యులైతే వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోందన్నారు.
75 మంది నుంచి శాంపిల్స్ సేకరణ
ఘటనకు సంబంధించిన అనుమానాల నేపథ్యంలో 75 మంది నుంచి రక్త, మూత్ర నమూనాలు సేకరించి ల్యాబ్ పరీక్షలకు పంపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పరీక్షా నివేదికలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఆహార భద్రతపై దృష్టి..
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించడంతో పాల సరఫరా వ్యవస్థపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని సూచించారు.
