313 ఓట్ల మెజారిటీతో సమీనా బేగం గెలుపు
మన భారత్ ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 22వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి సమీనా బేగం ఘన విజయం సాధించారు. అధికారిక లెక్కల ప్రకారం ఆమెకు మొత్తం 927 ఓట్లు లభించగా, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సయ్యద్ మోసిన్పై 313 ఓట్ల మెజారిటీతో విజేతగా నిలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
22వ వార్డులో పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రతి రౌండ్లో ఆధిక్యం మారుతూ ఆసక్తిని రేకెత్తించినా, తుది ఫలితంలో ఎంఐఎం అభ్యర్థి సమీనా బేగం గెలుపొందారు. ఫలితాలు వెలువడగానే పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి.
సమీనా బేగం మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఫరూక్ అహ్మద్ సతీమణి కావడం విశేషం. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి సదుపాయాలు, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.
ఈ విజయంతో ఆదిలాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో ఎంఐఎం బలం మరింత పెరిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
