మన భారత్, రాజస్థాన్:
పెళ్లి అనే పవిత్ర బంధానికే మచ్చ తెచ్చేలా రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పెళ్లయిన కేవలం మూడు నెలలకే భర్తను హత్య చేయించిందని ఓ యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఆశీస్ అనే యువకుడు అంజూ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి అనంతరం కూడా అంజూ తన ప్రియుడితో సంబంధం కొనసాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో భర్తను అడ్డుగా భావించిన ఆమె, ముందస్తు పథకం ప్రకారం హత్యకు కుట్ర పన్నిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటన జరిగిన రోజున వాకింగ్కు వెళ్దామని భర్త ఆశీస్ను బయటకు తీసుకెళ్లిన అంజూ, తన ప్రియుడితో కలిసి కారుతో ఢీ కొట్టి అతడిని హత్య చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఇది సాధారణ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే స్థానికుల అనుమానాలు, సీసీటీవీ ఫుటేజీ, ఫోన్ కాల్ రికార్డుల ఆధారంగా ఈ ఘటన వెనుక ఉన్న నిజాలు బయటపడ్డాయి. దీంతో అంజూ సహా ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ఈ ఘటనతో కొత్తగా పెళ్లి చేసుకునే యువకులు అప్రమత్తంగా ఉండాలని, సంబంధాల విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేసి ముందడుగు వేయాలని పలువురు సూచిస్తున్నారు. ప్రేమ, విశ్వాసం ఆధారంగా నిలబడాల్సిన దాంపత్య జీవితం, మోసం మరియు నేరాలకు దారి తీస్తే ప్రాణాలకే ప్రమాదమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
