ఆదిలాబాద్ ,మన భారత్:
అత్యవసర వైద్య సేవల్లో 108, 102 అంబులెన్స్ వాహనాలు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తలమడుగు, తాంసి మండలాల్లో ఈ సేవల ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోందని వెల్లడించారు.
ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను సమయానికి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు చేర్చడంలో 108 అంబులెన్స్ సేవలు ప్రాణరక్షకంగా మారుతున్నాయి. ప్రమాదాలు, గుండె సంబంధిత సమస్యలు, అకస్మాత్తు అనారోగ్య పరిస్థితుల్లో 108 సేవలు అత్యంత కీలకంగా ఉపయోగపడుతున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

అదేవిధంగా గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న 102 ‘అమ్మ ఒడి’ అంబులెన్స్ సేవలు సైతం మహిళలకు భరోసాగా నిలుస్తున్నాయి. గర్భిణులను క్రమం తప్పకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పెద్దాస్పత్రులకు తీసుకెళ్లి ప్రసవ సేవలు అందేలా చేయడమే కాకుండా, చికిత్స అనంతరం వారిని సురక్షితంగా తిరిగి స్వస్థలాలకు చేర్చడంలో 102 వాహనాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం 108 సేవల కోసం 36 అంబులెన్స్ వాహనాలు అందుబాటులో ఉండగా, 102 సేవలు గర్భిణులు, బాలింతలు, అత్యవసర చికిత్స అవసరమైన మహిళలకు సంజీవనిలా ఉపయోగపడుతున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా 108, 102 నంబర్లను సంప్రదించాలని పీఎం సామ్రాట్ ఈఎంఈ శేఖర్ సూచించారు. ప్రభుత్వ ఉచిత అంబులెన్స్ సేవలు అనేక ప్రాణాలను కాపాడుతున్నాయని, ప్రజారోగ్య పరిరక్షణలో ఇవి కీలకమైనవని ఆయన తెలిపారు.
