మెస్రం వంశీయుల సంప్రదాయ పూజల్లో విశేష సందడి
మన భారత్, ఆదిలాబాద్: జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఆదివాసుల ఆరాధ్యదైవమైన శ్రీ నాగోబా దేవత జాతర సందర్భంగా ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ గోడం నగేష్ ముఖ్య అతిథిగా హాజరై మెస్రం వంశీయుల సంప్రదాయం ప్రకారం హారతి నిర్వహించి నాగోబా దేవతను దర్శించుకున్నారు.
జాతర సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మ భోజ్జు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఐటిడిఎ పీఓలు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం నిర్వాహకులు ఎంపీ గోడం నగేష్తో పాటు ఇతర ముఖ్య అతిథులను శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చి సమస్యలను వినేందుకు దర్బార్లు నిర్వహించడమే కాకుండా, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనుల అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం గిరిజన అడ్వైజరీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటి పెళ్లి గంగాధర్ రావు, కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, ఇచ్చోడ బీజేపీ మండల అధ్యక్షుడు టెహారే రమేష్, పెందుర్ తులసి రామ్ కృష్ణ కుమార్, పెందూర్ కేశవ్, కనక తుకారాం తదితరులు పాల్గొన్నారు. నాగోబా జాతర సందర్భంగా కేస్లాపూర్ గ్రామం భక్తులతో కిటకిటలాడగా, ఆదివాసీ సంప్రదాయాల వైభవం వెల్లివిరిసింది.
