సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల విడుదల
మన భారత్ ,తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఆర్థిక బలం చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీలకు రూ.277 కోట్ల నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల విడుదలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మంగళవారం ప్రజాభవన్లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
గ్రామాల్లో పారిశుధ్యం, మౌలిక వసతులు, త్రాగునీరు, వీధిదీపాలు, రహదారుల మరమ్మతులు వంటి అభివృద్ధి పనులకు ఈ నిధులు వినియోగించనున్నారు. పండుగ వేళ నిధుల విడుదలతో గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగం పుంజుకోనున్నాయని అధికారులు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ గ్రామ పంచాయతీలకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసినందుకు మంత్రి సీతక్క ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం గ్రామీణ స్వరాజ్యానికి మరింత బలాన్ని చేకూరుస్తుందని ఆమె పేర్కొన్నారు.
