సంక్రాంతి ముందు చికెన్ ప్రియులకు షాక్..!
పండుగొస్తే చాలు.. ఆదివారం వస్తే మరీ ప్రత్యేకం. చుట్టాలు, స్నేహితులు ఇంటికి వచ్చిన వేళ పేద, మధ్యతరగతి కుటుంబాల భోజన పట్టికలో చికెన్ కూర తప్పనిసరి. ఆదివారం అంటే చాలా ఇండ్లలో చికెన్ వంటకం ఉండాల్సిందే. అయితే కొత్త సంవత్సరం ప్రారంభంలోనే చికెన్ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
📈 ట్రిపుల్ సెంచరీకి చేరిన చికెన్ ధర
గత కొన్ని రోజుల క్రితం వరకు కేజీ చికెన్ ధర రూ.200 నుంచి రూ.250 మధ్య కొనసాగగా, ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పీక్స్కు చేరాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కేజీ చికెన్ ధర రూ.300 వరకు పలుకుతోంది. ఎప్పుడూ లేని విధంగా కోడి మాంసం ధరలు భారీగా పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
🥚 గుడ్ల ధరలూ పెరిగాయి
చికెన్తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక్క గుడ్డు ధర రూ.8గా ఉంది. పెరిగిన చికెన్, గుడ్ల ధరలు చూసి “రేట్లు ఇంత పెరిగితే తినేదెలారా సామీ?” అంటూ వినియోగదారులు వాపోతున్నారు.
🐔 వివిధ రకాల చికెన్ ధరలు ఇలా..
బ్రాయిలర్ కోడి మాంసం (మార్కెట్): రూ.300/కేజీ
లైవ్ కోడి మాంసం: రూ.170/కేజీ
ఫారం కోడి మాంసం: రూ.180/కేజీ
బండ కోడి మాంసం: రూ.280/కేజీ వరకు

🚚 కోళ్ల సరఫరా ఉన్నా ధరలు ఎందుకు పెరిగాయి?
ఆంధ్రప్రదేశ్లోని పాయకరావుపేట, నక్కపల్లి ప్రాంతాల్లో దాదాపు 450 వరకు కోళ్ల పారాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 20 లక్షల వరకు కోళ్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవి జిల్లాలకే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. అయినప్పటికీ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ధరలు ఈ స్థాయిలో పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
🦠 బర్డ్ ఫ్లూ తర్వాత ధరల ఊగిసలాట
గతంలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్ల ధరలు భారీగా పడిపోయాయి. ఆ సమయంలో ప్రభుత్వం, పౌల్ట్రీ యాజమాన్యాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో మళ్లీ వినియోగం పెరిగింది. అప్పుడు కోడి ధరలు రూ.285 వరకు చేరాయి. అనంతరం డిసెంబర్ నెలలో ధరలు తగ్గి రూ.240–250 మధ్య స్థిరంగా కొనసాగాయి.
🎉 సంక్రాంతి, ఎన్నికలే ప్రధాన కారణాలా?
డిసెంబర్ చివరి వారం నుంచి ఈ ఏడాది తొలి వారం మధ్యలోనే చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇందుకు రాబోయే సంక్రాంతి పండుగ, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రధాన కారణాలుగా వ్యాపారులు చెబుతున్నారు.
తెలంగాణ పల్లెల్లో దావత్ల జోరు పెరగడం, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఇంటింటికీ కిలో చికెన్ ఉచితంగా పంపిణీ చేయడం వల్ల వినియోగం భారీగా పెరిగింది. దీంతో పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల నిల్వలు తగ్గిపోయాయి.
⚠️ రూ.400 దాకా వెళ్లే అవకాశం!
ప్రస్తుత పరిస్థితులు కొనసాగితే రానున్న రోజుల్లో చికెన్ ధర రూ.400 వరకు పెరిగే అవకాశం ఉందని చికెన్ షాప్ యజమానులు హెచ్చరిస్తున్నారు. దీంతో సామాన్యుడి వంటింట్లో చికెన్ మళ్లీ దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
