మన భారత్, మొగుళ్లపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చెన్న సరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబిస్తూ ఆకట్టుకుంది.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మొగుళ్లపల్లి ఎంఈఓ లింగాల కుమారస్వామి, గ్రామ సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి హాజరయ్యారు. విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు.
ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దుర్గం సురేష్ గౌడ్-త్రివేణి దంపతుల కుమార్తె, ఐదవ తరగతి విద్యార్థిని దుర్గం అమ్ములు భరతనాట్యం ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఆమె ప్రతిభకు గ్రామస్థులు, అతిథులు ప్రశంసలు కురిపించారు.
అనంతరం సర్పంచ్ నరహరి వెంకటరెడ్డి మాట్లాడుతూ, దుర్గం అమ్ములకు భరతనాట్యం నేర్పిన గురువు ఇస్మాయిల్ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలోనే కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తూ పాఠశాలకు మంచి పేరు తీసుకొస్తున్న ఉపాధ్యాయులను ఆయన ప్రశంసించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని విద్య, క్రీడలలో ముందుకు నడిపించడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని పేర్కొన్నారు.
పాఠశాలలో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి తాను కట్టుబడి ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఆళ్ల ముత్యంరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, దేవాలయ చైర్మన్ గూడూరి రఘుపతి రెడ్డి, పాఠశాల పీఏపీసీ చైర్మన్లు దుర్గం కావ్య, మిరుపూరి స్వరూప, మహిళా సంఘం సభ్యులు, గ్రామపంచాయతీ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
