తెలంగాణ హక్కులకు భంగం కలగనివ్వను: శాసనసభలో భావోద్వేగంగా సీఎం రేవంత్ రెడ్డి
మన భారత్, తెలంగాణ:
తెలంగాణ శాసనసభలో ‘నీళ్లు – నిజాలు’ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సవివరమైన సమాధానం ఇస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆవేశంగా అయినా, బాధతో అయినా, స్పష్టంగా చెప్పాలనుకున్నది ఒక్కటేనని—తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే తన ఆలోచన అని సీఎం స్పష్టం చేశారు. చిన్న వయసులోనే దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బాధ్యతగా భావిస్తున్నానని, ఈ కుర్చీలో ఉన్నంతకాలం తెలంగాణకు నష్టం కలిగించే చిన్న తప్పు కూడా చేయనని దేవుడిపై ప్రమాణం చేశారు.
కృష్ణా జలాలు, రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు, జల వివాదాలు, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, విపక్షాల విమర్శలు వంటి అన్ని అంశాలపై సీఎం సమగ్రంగా వివరించారు. ప్రతి సందర్భంలోనూ సంబంధిత పత్రాలను సభ ముందుంచి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తెలంగాణలో ప్రారంభమైన ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. వాటి ఆధారంగా గత ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కుల కోసం సమర్థంగా ప్రయత్నించలేదని, ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందని ఎత్తిచూపారు.
చర్చకు సమాధానమిస్తూ సీఎం భావోద్వేగంతో మాట్లాడుతూ, తెలంగాణ హక్కులకు భంగం కలిగించే ఏ చిన్న తప్పు కూడా చేయనని దేవుడిపై ఆన పెట్టారు. నీళ్లు, నిధులు, అభివృద్ధి విషయంలో సమిష్టిగా పనిచేస్తామని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. “నాకు నా ప్రాంతమే ముఖ్యం. ఆ తర్వాత పార్టీ, ఆ తర్వాత నాయకుడు. సీఎం కుర్చీలో ఉండి తెలంగాణకు అన్యాయం చేసేలా ప్రవర్తించను” అని తేల్చిచెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపించిన చరిత్ర తమదేనని సీఎం గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టు పనులు ఆపితేనే చర్చలకు వస్తామని స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. అవసరమైతే నిజనిర్ధారణ కమిటీ ద్వారా విచారణ చేయించుకోవచ్చని సవాల్ విసిరారు. “చచ్చినా.. బతికినా.. తెలంగాణ కోసమే. తెలంగాణ నీటిని ఆంధ్రాకు తాకట్టు పెట్టే పని చేయం. తెలంగాణ హక్కులను ఎవరు భంగం కలిగించినా నిటారుగా నిలబడి పోరాడుతా” అని వ్యాఖ్యానించారు.
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును మొదటి దశలో 45 టీఎంసీలు, రెండో దశలో మరో 45 టీఎంసీల సామర్థ్యంతో పూర్తి చేయాలని ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని సీఎం తెలిపారు. మొదటి విడత 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరినట్లు చెప్పారు. ఇదే సమయంలో కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ నుంచి న్యాయమైన నీటి కేటాయింపులు సాధించి ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం సైనికుల్లా నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని, నీటి వనరుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.
