మావోయిస్టుల హిట్లిస్ట్లో తెలంగాణ కాంగ్రెస్ నేత.. వదిలిపెట్టబోమని హెచ్చరిక
మన భారత్, తెలంగాణ: మావోయిస్టు పార్టీ అగ్రనేత మాద్వి హిడ్మా మృతి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించినట్లు మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ ‘విప్లవ’ పేరుతో శుక్రవారం బహిరంగ లేఖను విడుదల చేసింది.
అనారోగ్యంతో ఉన్న హిడ్మా, రాజితో పాటు మరికొంత మంది మావోయిస్టు సభ్యులకు వైద్యం చేయిస్తానని నమ్మించి ఒక కాంట్రాక్టర్ మోసం చేశాడని లేఖలో ఆరోపించారు. ఈ కుట్రలో భద్రాద్రి జిల్లా చర్ల ప్రాంతానికి చెందిన ఓ కీలక కాంగ్రెస్ నాయకుడి పాత్ర ఉందని మావోయిస్టులు పేర్కొన్నారు. గతంలో తాము క్షమాభిక్ష పెట్టిన ఆ నాయకుడే కొండవాయి మార్గంలో వాహనాన్ని ఏర్పాటు చేసి, మావోయిస్టులను ఆంధ్ర ప్రాంతానికి తరలించి శత్రువులకు పట్టించాడని లేఖలో వివరించారు.
ఈ కుట్రకు సంబంధించిన వాయిస్ రికార్డులు, ఇతర పక్కా ఆధారాలు తమ వద్ద ఉన్నాయని మావోయిస్టు పార్టీ స్పష్టం చేసింది. పార్టీని మోసం చేసిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరిస్తూ, ఇప్పటికే ఒక కాంట్రాక్టర్ను అంతమొందించామని పేర్కొన్నారు. తమ నిఘాలో మరికొంత మంది ఉన్నారని, ద్రోహులకు శిక్ష తప్పదని లేఖలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వైద్యం పేరుతో అగ్రనేతలను శత్రువులకు అప్పగించడం వెనుక భారీ కుట్ర జరిగిందని మావోయిస్టులు ఆరోపించారు.
