- ఇచ్చోడ ఇస్లాంపురలో పోలీసుల విస్తృత తనిఖీలు
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో 110 ద్విచక్ర వాహనాలు, ఆటో, 4 కార్లు స్వాధీనం
ఇచ్చోడ, ఆగస్టు 20: జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించేందుకు పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇచ్చోడ మండలంలోని ఇస్లాంపుర గ్రామంలో గురువారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టారు. ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, ఐపీఎస్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు.
110 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 4 కార్లు స్వాధీనం
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోకి వచ్చే, బయటకు వెళ్లే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 110 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ లేని, నకిలీ నంబర్ ప్లేట్లు కలిగిన 15 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం
ఈ సందర్భంగా ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే మాట్లాడుతూ జిల్లాలో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గంజాయిని సేవించడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా ప్రభుత్వ రాయితీ (PDS) బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం లేదా రవాణా చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మట్కా, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
ప్రజల భద్రతకు సీసీటీవీ కెమెరాలు ఎంతో ఉపయోగకరమని ఏఎస్పీ పేర్కొన్నారు. కాలనీ, గ్రామ ప్రజలు సమిష్టిగా ముందుకు వచ్చి ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
హెల్మెట్ ధరించాలి.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఏఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలకు సరైన నంబర్ ప్లేట్లు ఉండేలా చూసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, నేరాలను అరికట్టడం వంటి లక్ష్యాలతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను కొనసాగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్ర వర్ధన్, సీఐలు సీహెచ్ రమేష్, కే. నరేష్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, ఎన్. చంద్రశేఖర్, ఎస్సైలు, రిజర్వ్ సిబ్బంది, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
